వైఎస్ ఉన్నప్పుడు నేను ఏ రోజూ బయటకు రాలేదు: వైఎస్ విజయమ్మ
- వైఎస్ పోయాక బయటకు రావాల్సి వచ్చింది
- జగన్ తల్లి, చెల్లెలు వచ్చారంటూ ఎగతాళి మాటలొద్దు
- ‘పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదు’ అన్న విజయమ్మ
తన భర్త వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు తాను ఏ రోజూ బయటకు రాలేదని వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో ఆమె మాట్లాడుతూ, వైఎస్ పోయిన తర్వాత బయటకు రావాల్సిన పరిస్థితులు వచ్చాయని, జగన్ తల్లి, చెల్లెలు వచ్చారంటూ ఎగతాళిగా కొందరు మాట్లాడుతున్నారని, వాళ్లు అలా మాట్లాడినా ఫర్వాలేదని, ఎన్నో విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన విజయమ్మ, ‘పడ్డవాళ్లెప్పుడూ చెడ్డవాళ్లు కాదు’ అన్న సామెతను ప్రస్తావించారు. ఎన్ని మాటలన్నా ప్రజల పక్షాన పోరాడాలని జగన్ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు. ఆ రోజున జగన్ జైల్లో ఉన్నప్పుడు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు బయటకు వచ్చి ప్రచారం చేయాల్సి వచ్చిందని, ఈ రోజున ప్రజలందరూ తమ కుటుంబం అని భావించి వాళ్ల దగ్గరకు వచ్చానని చెప్పారు.